లండన్ వెళ్లొచ్చినా సైకో తత్వం పోలేదు: అనగాని సత్యప్రసాద్

  • రాజారెడ్డి రాజ్యాంగం, హత్యల చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్న అనగాని
  • గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడారని ఆరోపణ
  • తల్లినీ, చెల్లినీ తరిమేసిన వ్యక్తిత్వం ఆయనదని వ్యాఖ్య
"గొడ్డలి పార్టీ అధ్యక్షుడు" కొత్తగా తాను అమాయకుడినని, అహింసావాదినని మాట్లాడుతున్నారని, కానీ ఆయన చరిత్ర, ఆయన పూర్వీకుల చరిత్ర ఏమిటో ప్రపంచమంతటికీ తెలుసని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన దారుణాలు, హత్యల గురించి రాయలసీమలో ఏ గడపను అడిగినా చెబుతారని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం గురించి అడిగితే కతలు కథలుగా వివరిస్తారని, అలాంటి రాజారెడ్డి పోలికలు తనకు వచ్చాయని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అని ఆయన విమర్శించారు.

తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన వ్యాపారానికి అడ్డొచ్చిన పరిటాల రవితో సహా ఎంతోమందిని హతమార్చిన చరిత్ర ఆయనదని అనగాని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు చేసి, హత్యలు చేసి వారిపై దొంగతనం కేసులు పెట్టించిన చరిత్ర వాళ్లదని దుయ్యబట్టారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రయ్య లాంటి పార్టీ విధేయులను కూడా పార్టీ మారమని గొంతుకోసి చంపారని, అమర్‌నాథ్ గౌడ్, సుధాకర్ వంటి ఎందరో బలైపోయారని గుర్తుచేశారు. ఈ సైకో చేసిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారని అన్నారు.

కుటుంబ సభ్యుల విషయంలోనూ ఆయన వైఖరి దారుణంగా ఉందని అనగాని అన్నారు. ఆస్తి కోసం కన్నతల్లినీ, చెల్లినీ తరిమేసిన వ్యక్తిత్వం ఆయనదని, అందుకే ఆయన సోదరి సునీత ఆవేదన చెందుతున్నారని తెలిపారు. సొంత బాబాయ్ హత్య కేసులో సీబీఐ విచారణకు వస్తే, తన బంధువైన ఎంపీని కాపాడటం కోసం అధికారులపైనే దాడులు చేసి తరిమేశారని ఆరోపించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్‌ని చంపిన వ్యక్తిని కనిపెట్టలేకపోయారా? అసలు ఎవరు చంపారో ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టిద్దామనుకుంటే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు.

డబ్బు కోసం ఎలాంటి నీచమైన పని అయినా చేసే చరిత్ర ఉన్న కుటుంబం వారిదని, సొంత నాయకులకే నమ్మకం లేకపోవడంతో పార్టీ 11 సీట్లకు పడిపోయిందని, ఇప్పుడు ఆ 11 కూడా గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. "నీకేమో ఊరికో ప్యాలెస్‌లు కట్టుకున్నావు. రాష్ట్రానికి రాజధాని వద్దా? 'మావిగన్' పేరు చెబితే చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు. లండన్ వెళ్లి మందులు వేసుకున్నా నీ సైకో తత్వం, మెంటల్ పోయినట్లు లేదు" అని అనగాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం సుభిక్షంగా ఉందని, పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని, ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Anagani Satya Prasad
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh Politics
TDP
YSRCP
Chandrababu Naidu
Paritala Ravi
Rayalaseema
Political Criticism

More Telugu News